రూ.16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు లోకేష్ సాయం..
మంత్రి నారా లోకేష్ సమక్షంలో హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు..
హైదరాబాద్: “సేవ్ పునర్విక” అంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మార్మోగిన పిలుపు చివరకు సంతోషకర ముగింపుకు చేరింది. లక్షలాది మంది ప్రార్థనలు, దాతల సహాయం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ అండతో చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించింది.
అరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1)తో బాధపడుతున్న ఏడాది వయసున్న పునర్వికకు జీవనాధారం ఒక్కటే—రూ.16 కోట్ల ఖరీదైన జీన్ థెరపీ ఇంజెక్షన్ జోల్ జెన్ స్మా. ఈ ఇంజెక్షన్ను అమెరికా నుంచి హైదరాబాద్కు తెప్పించి, జూబ్లీహిల్స్లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా అందించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ స్వయంగా ఆసుపత్రిలో హాజరై చిన్నారిని పరామర్శించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పావతి ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నారు. తమ కూతురిని కాపాడాలనే ఆరాటంతో వారు సోషల్ మీడియా ద్వారా సహాయం కోరగా, దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించారు. విరాళాల రూపంలో దాదాపు రూ.10 కోట్లు సమకూరినా ఇంకా అవసరమైన మొత్తానికి లోటు ఉండటంతో మంత్రి లోకేష్ను సంప్రదించారు.
అప్పుడే స్పందించిన లోకేష్, “పునర్విక బాధ్యత నా మీద” అంటూ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇంజెక్షన్ దిగుమతి నుంచి ఆసుపత్రి చికిత్స వరకు ప్రతి దశను స్వయంగా పర్యవేక్షించారు. ప్రముఖ ఔషధ సంస్థ నోవార్టీస్, వైద్యులు, అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన అనుమతులు, చెల్లింపులు, రవాణా ప్రక్రియలను వేగవంతం చేశారు.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండగా, పునర్విక నవ్వులు కుటుంబ సభ్యులకు కొత్త ఆశ నింపాయి. చిన్నారి ఏడుస్తుండగా లోకేష్ స్వయంగా ఎత్తుకుని ఓదార్చిన క్షణాలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేశాయి.
“మా కూతురికి మేము జన్మనిచ్చాం… కానీ పునర్జన్మ ఇచ్చింది లోకేష్ గారు” అంటూ పునర్విక తల్లిదండ్రులు కృతజ్ఞతాభావంతో తెలిపారు. తమ చిన్నారి ప్రాణాలను కాపాడిన మంత్రి, వైద్యులు, సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన మరోసారి మానవత్వం, సహకారం, సమాజం కలిసికట్టుగా ఉంటే అసాధ్యమేమీ లేదని నిరూపించింది. చిన్నారి పునర్విక కథ ఇప్పుడు వేలాది హృదయాలకు ప్రేరణగా మారింది.