Chandrababu: రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడం, వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించారు.
పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో చర్చించిన సీఎం..
ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోనులో చర్చలు..
ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడడం, వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన అధికారులతో విస్తృతంగా చర్చించారు.
పలు జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్న సీఎం, సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అలాగే పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించారు. ఇంధన సరఫరా అంశంపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ లేని పెట్రోల్ బంకుల వివరాలను తక్షణం అందించాలని ఆదేశించారు. దీనిపై రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులకు సమాచారం పంపింది.
ఇక సమస్యను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కీలక సూచనలు చేశారు. స్టాక్ సమస్య ఉన్నవారు వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఆయిల్ కంపెనీలు కూడా సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. గత ఏప్రిల్తో పోలిస్తే 10 శాతం అదనపు ఇంధన సరఫరాకు అంగీకరించాయి. ఇదే సమయంలో పెట్రోల్ డీలర్ల నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఏపీఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్ నిమగ్నమయ్యారు.
క్షేత్రస్థాయిలో ఆయిల్ కంపెనీల సరఫరా పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడానికి అసోసియేషన్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. ఈ నివేదికను కమిషనర్కు సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొత్తం మీద ప్రభుత్వం వేగంగా స్పందించడంతో, రాష్ట్రంలో ఇంధన కొరత సమస్య త్వరలోనే తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
Be the first to react