AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్!
AP Property Tax Rebate 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందే పన్ను చెల్లిస్తే 5% రాయితీతో పాటు, పాత బకాయిల వడ్డీపై 50% మాఫీని అందిస్తోంది. ఈ సువర్ణ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
AP Property Tax Rebate 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు తమ ఆస్తి పన్నును సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)కి సంబంధించి ఎవరైతే తమ ఆస్తి పన్నును ముందుగానే చెల్లిస్తారో, వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుంది. ఈ అవకాశం కేవలం ఈ నెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే పన్ను రూపంలో మీరు కట్టాల్సిన మొత్తంలో కొంత భారం తగ్గుతుందన్నమాట.
కొత్త పన్నుపై రాయితీ ఇవ్వడమే కాకుండా, పాత బకాయిలు ఉన్నవారికి కూడా ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. గత ఏడాది (2025-26) వరకు ఆస్తి పన్ను కట్టకుండా పెండింగ్లో ఉన్న వారు, ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారి వడ్డీపై 50 శాతం మాఫీ ఇస్తున్నారు. గతంలో ఈ గడువు మార్చి 31తో ముగియగా, ప్రజల అభ్యర్థన మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే పూర్తి వడ్డీతో పన్ను చెల్లించి ఉంటే, అటువంటి వారికి వచ్చే ఏడాది బిల్లులో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజిటల్ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా లేదా మున్సిపల్ యాప్ల ద్వారా ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చుని పన్ను కట్టే వెసులుబాటు ఉంది. నగదు రహిత చెల్లింపుల వల్ల పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 3,559 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసింది. వడ్డీ మాఫీ పథకం వల్లే చాలా మంది ముందుకు వచ్చి బకాయిలు చెల్లించారని గణాంకాలు చెబుతున్నాయి.
Be the first to react