ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ విడతలో రైతులకు మొత్తం ₹7,000 అందుతుంది. ఇందులో ₹2,000 పీఎం కిసాన్ నుండి, ₹5,000 రాష్ట్ర ప్రభుత్వ భాగంగా అందజేస్తారు. అయితే కొందరు రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కాకపోవడంతో వారు సందిగ్ధంలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎందుకు డబ్బులు రాలేదో, ఏమి చేయాలనేదాని పై స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
డబ్బులు పొందకపోవడానికి ప్రధాన కారణం పీఎం కిసాన్ e-KYC పూర్తి చేయకపోవడమే. కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా e-KYC చేయడానికి మీసేవా సెంటర్లు మరియు CSC కేంద్రాల్లో మాత్రమే అనుమతిస్తోంది. e-KYC పూర్తి చేసిన రైతులకు 30–60 రోజుల లోపే NPCI లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అందువల్ల రైతులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇంకో ప్రధాన సమస్య రైతు ఆధార్–పట్టాదారు పాసుబుక్ లింక్ కాలేకపోవడం. దీన్ని సరిచేయడానికి రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లింక్ అప్లికేషన్ సమర్పించాలి. తహసీల్దార్ కార్యాలయం ఆమోదించిన తర్వాత మండల వ్యవసాయ అధికారి–జిల్లా కార్యాలయాలకు సమాచారం పంపిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
రైతుల బ్యాంక్ ఖాతా NPCI లింక్ లేకపోవడం కూడా ముఖ్య సమస్య. రైతులు తాము అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంకును సందర్శించి NPCI లింక్ చేయించుకోవాలి. అవసరమైతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొత్త ఖాతా ఓపెన్ చేసుకున్నా NPCI లింక్ అవుతుంది. NPCI లింక్ పూర్తయిన తర్వాత 30–90 రోజుల్లో నిలిచిపోయిన డబ్బులు జమ అవుతాయి.
కొంతమందికి అనుమానాస్పద రికార్డులు, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు, ఆదాయ పన్ను చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగం వంటి కారణాల వల్ల అనర్హతగా గుర్తించి డబ్బులు ఆపవచ్చు. సమస్యలు ఉన్న రైతులు దగ్గరలోని సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే, అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించి డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.