Raghav Chadha: రాజ్యసభలో రాఘవ్ చడ్డా పదవిపై AAP కీలక నిర్ణయం! పార్టీ ప్రతిపాదన ఏంటంటే..
Aam Aadmi Party: రాజ్యసభ లో పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చడ్డాను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపాదన. రాఘవ్ చడ్డా స్థానంలో అశోక్ మిట్టల్..
రాజ్యసభలో పార్టీ ప్రసంగ సమయం నుంచి కూడా రాఘవ్ చడ్డా తొలగింపు..
ఇకపై ఆప్ రాజ్య సభ ఉపనేతగా అశోక్ మిట్టల్..
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజ్యసభ లో పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చడ్డాను ఆ పదవి నుంచి తొలగించాలని పార్టీ లేఖ రాసినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఈ లేఖలో భాగంగా, ఇకపై రాజ్యసభలో పార్టీకి కేటాయించే ప్రసంగ సమయం నుంచి కూడా రాఘవ్ చడ్డాకు అవకాశం ఇవ్వకూడదని AAP కోరినట్లు సమాచారం. ఇది పార్టీ పార్లమెంటరీ వ్యూహంలో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
రాఘవ్ చడ్డా స్థానంలో అశోక్ మిట్టల్ను రాజ్యసభ ఉపనేతగా నియమించాలని పార్టీ ప్రతిపాదించింది. ఈ నియామకాన్ని త్వరగా అధికారికంగా ప్రకటించాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం AAPకు రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుండి, ముగ్గురు ఢిల్లీ నుండి ఎన్నికయ్యారు.
రాఘవ్ చడ్డా రాజకీయ ప్రస్థానం
పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చడ్డా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుండే పార్టీతో ఉన్నారు. 2012లో అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీ లోకపాల్ బిల్లుపై పని చేయడం ద్వారా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
తర్వాత పార్టీ జాతీయ ప్రతినిధిగా, 2015 ఢిల్లీ ఎన్నికల తర్వాత పార్టీకి అతి పిన్న వయస్కుడైన ట్రెజరర్ గా ఎదిగారు. 2019 లోక్సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి గెలుపొందారు.
తదుపరి ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా సేవలందించారు. 2022లో 33 ఏళ్ల వయసులో రాజ్యసభకు ఎన్నికై, అతి పిన్న వయస్కుడైన ఎంపీగా గుర్తింపు పొందారు. 2023లో పార్టీ తరఫున రాజ్యసభలో నాయకుడిగా నియమితులై, సంజయ్ సింగ్ స్థానాన్ని భర్తీ చేశారు.
ప్రజా సమస్యలపై గళం
రాఘవ్ చడ్డా తరచుగా ప్రజా సమస్యలపై రాజ్యసభలో తన గళాన్ని వినిపిస్తూ వార్తల్లో నిలిచారు. ఇటీవల “సర్పంచ్ పతి” వ్యవస్థపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు కేటాయించిన స్థానాల్లో నిజమైన అధికారాన్ని పురుషులు వినియోగించడం రాజ్యాంగ ఉద్దేశ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ అంశంపై కూడా ఆయన చర్చకు తెరలేపారు. ఇది ఆరోగ్యం, విద్య, సమానత్వానికి సంబంధించిన సమస్యగా పేర్కొంటూ, శానిటరీ సదుపాయాల లేమి కారణంగా బాలికలు పాఠశాలకు దూరమవుతున్న పరిస్థితిని విమర్శించారు.
ప్రజల మధ్యకు వెళ్లిన నాయకుడు
ఈ ఏడాది గిగ్ వర్కర్ల నిరసనల సమయంలో, వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక రోజు డెలివరీ భాగస్వామిగా పనిచేయడం ద్వారా కూడా రాఘవ్ చడ్డా ప్రత్యేక గుర్తింపు పొందారు.
AAP తాజా నిర్ణయం రాజ్యసభలో పార్టీ విధానాల్లో మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. రాఘవ్ చడ్డా భవిష్యత్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉండగా, అశోక్ మిట్టల్ నియామకం త్వరలో అధికారికంగా ఖరారు అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Be the first to react