1700 కిలోమీటర్ల దూరం నుంచి తరలివచ్చిన అభిమానులు..
విజయవాడకు నేరుగా విమానాల కోసం మహానాడులో తీర్మానం..
సౌదీ అరేబియాలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం దమ్మాం నగరంలో ఎన్నారై టీడీపీ సౌదీ అరేబియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని గల్ఫ్ దేశంలోకి తీసుకొచ్చినట్టుగా కనిపించింది. పార్టీ అభిమానులు, ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
దమ్మాంలో జరిగిన ఈ మహానాడు, కేవలం రాజకీయ కార్యక్రమంగా కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా మారింది. సభ ప్రాంగణం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడింది.
ఈ కార్యక్రమానికి విజయవాడ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేత మహాసేన రాజేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోడె ప్రసాద్.. “బయట ప్రపంచం అనుకునేలా కాకుండా సౌదీ అరేబియా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇక్కడి వాతావరణం, జీవన విధానం చాలా అద్భుతంగా ఉన్నాయి” అని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, పార్టీ నేత సుఖవాసి వీడియో కాల్ ద్వారా ప్రసంగించి సౌదీ టీడీపీ బృందాన్ని అభినందించారు. అలాగే గల్ఫ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రావి రాధాకృష్ణ జూమ్ ద్వారా ప్రసంగించారు.
పార్టీపై అభిమానంతో ప్రవాసాంధ్రులు వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి మహానాడుకు హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీకి కంచుకోటగా భావించే రియాద్ నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంకు మహిళలు, పిల్లలతో కలిసి ప్రత్యేక బస్సుల్లో కార్యకర్తలు తరలివచ్చారు. జెడ్డా నుంచి 1200 కిలోమీటర్లు, జోర్డాన్ సరిహద్దులోని తబూక్ నుంచి దాదాపు 1700 కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు సభలో పాల్గొన్నారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమాలు సభకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ప్రముఖ గాయకులు రఘు కుంచె, మాళవిక తమ పాటలతో సభికులను అలరించారు. రియాద్ టీడీపీ బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ మహానాడు విజయవంతం కావడానికి నిర్వాహక బృందం జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాసరావు తదితరులు రాత్రింబవళ్లు శ్రమించి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు వచ్చిన అతిథులు, కార్యకర్తలకు సంప్రదాయ తెలుగు వంటకాలతో ప్రత్యేక భోజన విందు ఏర్పాటు చేశారు.
మహానాడులో పలు కీలక తీర్మానాలు కూడా ఆమోదం పొందాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌదీ అరేబియా సహా ఇతర గల్ఫ్ దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేలా ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని టీడీపీ సౌదీ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా సూచించారు. ఈ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కోసం వీసా, మెడికల్ పరీక్షలకు సంబంధించిన ‘గమ్కా’ కేంద్రాలను విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గల్ఫ్లో మరణించిన ప్రవాసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం, గృహ వసతి కల్పించాలని కూడా సభలో కోరారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు ప్రజలతో, తెలుగు రాజకీయాలతో తమ అనుబంధం ఎంత బలంగా ఉందో ఈ మహానాడు మరోసారి చాటిచెప్పింది.