చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించిన మంత్రి కొల్లు రవీంద్ర..
జిల్లా కలెక్టర్ చొరవను అభినందించిన మంత్రి..
మచిలీపట్నం: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందులో ప్రజల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా జరిగిన “జలధార – జలహారతి” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మంత్రి మాట్లాడుతూ, ప్రతి నెల మూడో శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని తెలిపారు. పరిశుభ్రత ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని మంత్రి వెల్లడించారు. మచిలీపట్నంలోని బందరు డంపింగ్ యార్డులో సుమారు లక్ష టన్నుల చెత్త పేరుకుపోయిందని, దీనిని పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే, కొత్తగా సేకరించే చెత్తను ప్రాసెస్ చేయడానికి 13 ఎకరాలు కేటాయించామని, అక్కడి నుంచి గుంటూరులోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జిల్లా పరిషత్ సమీపంలోని చెరువు వద్ద పార్కు అభివృద్ధికి రూ.2.72 కోట్ల నిధులు మంజూరు కాగా, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. 1864లో ఏర్పడిన రెండో మున్సిపాలిటీగా మచిలీపట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో 42వ స్థానంలో ఉన్న మచిలీపట్నాన్ని టాప్ 10లోకి తీసుకురావడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు.
గతంలో కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం కాలేదని, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ డ్రైనేజీ అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందుకోసం రూ.70 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఈ నెల 25లోగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్లాస్టిక్ నిర్వహణలో జిల్లా కలెక్టర్ చొరవను మంత్రి అభినందించారు. చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడమే వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణమని పేర్కొంటూ, “స్వచ్ఛ బందరు” సాధన కోసం ప్రజలంతా కలిసి ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.