రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం దిశానిర్దేశం..
అమరావతి: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
పంటలకు మంచి ధరలు రావాలంటే ట్రేసబిలిటీ (పంట మూలాన్ని గుర్తించే విధానం), సర్టిఫికేషన్ వంటి వ్యవస్థలను అమలు చేయాలని సూచించారు. ఇవి రైతులకు అదనపు లాభం అందించే అవకాశముందని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చే అవకాశముందని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నాణ్యమైన దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే, ప్రకృతి సేద్యం విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఆయన వివరించారు. రైతు ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.