సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్..
తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు..
అమరావతి: రాష్ట్ర తీరప్రాంతాల్లో సముద్ర నాచు (సీవీడ్) సాగు ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించాలనే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, సీవీడ్ ఆధారిత ఆదాయంపై ప్రత్యేక ఎకనామిక్ మోడల్ రూపొందించాలని సూచించారు.
స్వయం సహాయ సంఘాల (SHG) మహిళలు, మత్స్యకార కుటుంబాలకు అదనపు ఆదాయం అందేలా సీవీడ్ ఫార్మింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న విస్తారమైన సముద్ర తీర ప్రాంతాలు ఈ సాగుకు అనుకూలమని, దీన్ని ఉపయోగించుకుని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి పెంచాలని అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థలు – సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ – అధికారులతో సీఎం వర్చువల్ సమావేశం నిర్వహించారు. సీవీడ్ సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయన స్పష్టం చేశారు.
మహిళలకు సీవీడ్ సాగుపై శిక్షణ, సాంకేతిక సహాయం అందించేందుకు అమృతా విశ్వ విద్యాపీఠం సహకారంతో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పష్టంగా అంచనా వేసేలా ఎకనామిక్ మోడల్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.
సీవీడ్ కేవలం సాగు పరిమితిలోనే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని సీఎం వివరించారు. ఫార్మా, న్యూట్రాసిటికల్ రంగాల్లో ఇది ముఖ్య ముడిసరుకుగా ఉపయోగపడుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. అందుకే ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా సీవీడ్ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర సంపదను వినియోగించుకుంటూ మహిళలకు ఉపాధి కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సీవీడ్ సాగు రాష్ట్రంలో కొత్త ఆర్థిక అవకాశాలకు దారితీస్తుందని, మహిళల సాధికారతకు ఇది ముఖ్యమైన అడుగవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.