వైసీపీపై టీడీపీ ఘాటు విమర్శలు… “గొడ్డలి పార్టీ” అంటూ దుమారం..
పంచుమర్తి అనురాధ ఫైర్… వైసీపీ నేర చరిత్రపై సంచలన వ్యాఖ్యలు..
మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “వైసీపీ గొడ్డలి పార్టీ, నేరస్తుల పార్టీ” అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ “జావా డిస్కవర్” విడుదల చేసిన “ప్లానెట్ కిల్లర్స్: ది ఫారెస్ట్ డిస్ట్రాయర్” డాక్యుమెంటరీలో వైసీపీ నాయకుల నేర చరిత్ర బయటపడిందని ఆమె అన్నారు. ఆ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్గా పేరుగాంచిన కొల్లం గంగిరెడ్డి గురించి ప్రస్తావన ఉందని, అతను మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా పనిచేశాడని పేర్కొన్నారు.
కొల్లం గంగిరెడ్డి కడప జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపగల వ్యక్తి అని, 2003లో తిరుపతి అలిపిరి వద్ద జరిగిన నారా చంద్రబాబు నాయుడుపై క్లేమోర్ మైన్స్ దాడిలో నిందితుడిగా ఉన్నాడని ఆరోపించారు. అలాగే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడని చెప్పారు. అతని కుటుంబ సభ్యులు కూడా రాజకీయ పదవులు పొందారని విమర్శించారు.
జగన్ రెడ్డి నేర చరిత్ర కలిగిన వ్యక్తులతో సంబంధాలు పెంచుకున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించారని అనురాధ ప్రశ్నించారు. “ఎవరిని ప్రోత్సహించారు? ఎవరిని బెయిల్పై బయటకు తీసుకువచ్చారు? ఎవరికి పదవులు ఇచ్చారు?” అని ఆమె నిలదీశారు.
వైసీపీని “గొడ్డలి పార్టీ” అని పిలవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అయితే ఎర్రచందనం స్మగ్లింగ్లో గొడ్డళ్ల వినియోగం, వివేకానంద రెడ్డి హత్యలో జరిగిన దారుణం వంటి విషయాలు చూస్తే ఆ పేరే సరిపోతుందని ఆమె అన్నారు.
జగన్ రెడ్డిపై 30కు పైగా కేసులు ఉన్నాయని, అతని అనుచరుడు గంగిరెడ్డిపై 27 కేసులు ఉన్నప్పటికీ ఇద్దరూ బెయిల్పై బయట తిరుగుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉండి రాజకీయాలు నడిపిస్తున్నారని, రాష్ట్రంలో నేరాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చి గట్టి పాఠం చెప్పారు అని అనురాధ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకుల్లో చాలామందికి నేర చరిత్ర ఉందని, భవిష్యత్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇక మరోవైపు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేస్తున్నారని, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు.