- రాష్ట్రంలో ఎస్హెచ్జీ మహిళల సీవీడ్ ఫార్మింగ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష..
- Politics: తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా మలిచే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక అడుగులు వేశారు. సముద్ర నాచు (సీవీడ్) సాగు ద్వారా తీరప్రాంత మహిళలు, మత్స్యకార కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పించేలా ఒక పటిష్టమైన 'ఎకనామిక్ మోడల్'ను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్ ఉన్న అవకాశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వయం సహాయ సంఘాల (SHG) మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ సాగు ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని తీరప్రాంతం సీవీడ్ కల్టివేషన్కు అత్యంత అనుకూలమని, దీనిని వాణిజ్య స్థాయిలో ప్రోత్సహించడం ద్వారా భారీగా సంపద సృష్టించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టును శాస్త్రీయంగా మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. అమృతా విశ్వవిద్యాపీఠం సహకారంతో మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుపై అవగాహన కల్పించి, సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. కేవలం సాగుకే పరిమితం కాకుండా, సముద్ర నాచు ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను (Value Addition) తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఏపీ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన వివరించారు.
ఫార్మా మరియు న్యూట్రాసిటికల్ రంగాల్లో సీవీడ్కు ఉన్న విపరీతమైన గిరాకీని దృష్టిలో ఉంచుకుని, దీనిని ఒక ప్రధాన ముడిసరుకుగా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి కోసం అవసరమైతే జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెరైన్ రంగంలో సంపద సృష్టికి సీవీడ్ ఒక కీలక ప్రత్యామ్నాయంగా మారుతుందని, ఇది భవిష్యత్తులో తీరప్రాంత మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.