Hormuz Strait Toll Fee: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు అతిముఖ్యమైన చమురు రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి'పై తన పట్టు బిగిస్తోంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి భారీగా టోల్ ఫీజు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది.
రియాల్లోనే చెల్లింపు.. భారీగా వసూళ్లు
ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ప్రతి ఆయిల్ ట్యాంకర్ సుమారు 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.18.90 కోట్లు) టోల్ కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ మొత్తాన్ని డాలర్లలో కాకుండా ఇరాన్ సొంత కరెన్సీ అయిన 'రియాల్'లోనే కట్టాలని నిబంధన పెట్టింది. దీనివల్ల అమెరికా డాలర్ పై ఉన్న ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ నిబంధనల కింద కొన్ని నౌకలు క్లియరెన్స్ పొంది ప్రయాణించడం విశేషం.
అమెరికా, ఇజ్రాయెల్కు నో ఎంట్రీ!
తమ సార్వభౌమాధికారాన్ని చాటుకోవడమే లక్ష్యంగా ఇరాన్ ఈ అడుగు వేసింది. కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, తమ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ జలసంధిపై పహారా కాస్తూ, తమకు కావాల్సిన దేశాలకు మాత్రమే అనుమతులు ఇస్తోంది. ఇది ప్రపంచ దేశాల మధ్య కొత్త దౌత్య యుద్ధానికి తెరలేపుతోంది.
భారత్పై ప్రభావం ఎంత?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. భారత్ కూడా తన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే ఇరాన్ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సముద్ర జలాల్లో ఇలాంటి సుంకాలు విధించడం చెల్లదని స్పష్టం చేసింది. యుద్ధం లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని భారత పెట్రోలియం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భగ్గుమంటున్న జీ7 దేశాలు
ఇరాన్ తీరుపై అమెరికాతో పాటు జీ7 దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ జలమార్గాలను ఆక్రమించుకోవడం సరైన పద్ధతి కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. అటు బ్రిటన్ ప్రధాని కూడా రంగంలోకి దిగి, 35 దేశాల మద్దతుతో ఈ మార్గాన్ని తిరిగి స్వేచ్ఛాయుతంగా మార్చడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఒక పెద్ద రాజకీయ చదరంగంగా మారిపోయింది. దీనివల్ల సామాన్యుడిపై ధరల భారం ఎంత పడుతుందో వేచి చూడాలి.