ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, విభాగాల కార్యదర్శులు, హెచ్వోడీలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు శాఖల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనితీరు మందగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు చేరుకునే సేవల్లో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖపై జరిగిన ప్రత్యేక సమీక్షలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేస్తూ ప్రజలకు నేరుగా నమ్మకం కల్పించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పదేపదే ఛార్జీలను పెంచి భారీ భారం మోపిందని, మొత్తం రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ రూ.1 కోటి పది లక్షల అప్పులో కూరుకుందన్న విషయాన్ని బయటపెట్టారు. ప్రజల ధనం దుర్వినియోగం అయ్యేలా గత ప్రభుత్వం పీపీఎలను (Power Purchase Agreements) రద్దు చేసిందని సీఎం విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే నిబద్దతతో ముందుకు సాగుతుందని చెప్పారు.
ఛార్జీలు పెంచకుండా, విద్యుత్ను మరింత సమర్థవంతంగా ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.19 నుండి రూ.4.92 కి తగ్గిందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఉండే భారం తగ్గడమే కాకుండా, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ శాఖ కూడా నిజాయితీగా పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రజలకు నేరుగా ఉపయోపడే విధంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శాఖల నుంచి నిధుల కోసం ఎడతెరపిలేకుండా ప్రతిపాదనలు వస్తున్నాయని, ఇప్పటికే విడుదలైన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలియజేశారు.
ఏపీ అభివృద్ధి దిశలో ప్రభుత్వం గట్టిగా అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్గా నిలుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.50 వేల కోట్లకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి ప్రజల జీవనోపాధిని బలపరిచామని వివరించారు. ప్రతి శాఖ తన పనితీరును మెరుగుపర్చుకోవడానికి జనవరి 15 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షితమైనట్లు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత వీలవుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలో పటిష్టంగా ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.