కొబ్బరి అధారిత ఉత్పత్తులతో అదనపు ఆదాయం దక్కేలా ప్రణాళికలు..
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా భవిష్యత్తు ప్రణాళికలు..
అమరావతి: రాష్ట్రంలో కొబ్బరి రైతులకు మరింత ఆదాయం వచ్చేలా విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా మంత్రి, పొల్లాచిలో ఉన్న ఎకో కోయిర్ క్లస్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ SFURTI స్కీమ్ పథకం కింద ఏర్పాటు చేసిన ఈ క్లస్టర్ పనితీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు.
సుమారు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC)ను పరిశీలించిన మంత్రి, కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానంపై ఆసక్తిగా తెలుసుకున్నారు. ముఖ్యంగా PVC టఫ్టెడ్ కాయిర్ మ్యాట్స్, జియో-టెక్స్టైల్స్, కోకోపీట్ బ్లాక్స్, మల్చ్ మ్యాట్స్ వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నట్లు ఆయన గుర్తించారు.
పొల్లాచ్చిలోని కాయిర్ క్లస్టర్ను రోల్ మోడల్గా అభివర్ణించిన మంత్రి, మన రాష్ట్రంలో ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొబ్బరి నార పరిశ్రమను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థంగా పడేసే కొబ్బరి పీచుతో విలువైన ఉత్పత్తులు తయారు చేసి, రైతులకు మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ క్లస్టర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. పర్యావరణానికి అనుకూలమైన ఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేలా రాష్ట్రంలోని MSME యూనిట్లను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్శనలో కోయంబత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ షణ్ముగ శివ, సీఈవో కన్నన్, స్థానిక రైతులు తదితరులు మంత్రితో కలిసి పాల్గొన్నారు.