ఏపీ మద్యం కుంభకోణం (AP Liqour Scam) లో మాస్టర్ మైండ్గా వ్యవహరించిన వైకాపా ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy) అరెస్టయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన్ను సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడ (Vijayawada)లోని సిట్ కార్యాలయంలో సుమారు 7 గంటలపాటు విచారించిన అనంతరం ఎంపీని అరెస్ట్ చేసింది. ఈ సమాచారాన్ని ఆయన బంధువులకు సిట్ అధికారులు తెలియజేశారు.
లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్రెడ్డిని సిట్ ప్రశ్నించింది.
ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనేదానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారుకి చేర్చిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైకాపా ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది.
ఈ కుంభకోణానికి వ్యూహరచన, అమలులో మిథున్రెడ్డి 'మాస్టర్ మైండ్' అంటూ సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని, అందుకు ఆధారాలు లభించాయని సిట్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు (High Court) కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఆయన పిటిషన్ ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.