ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. మూడు వారాల్లో కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.. దర్యాప్తు సంస్థ సంజయ్ కస్టడీ కోసం మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. అలాగే సంజయ్ బెయిల్ కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. మరి సంజయ్ మూడు వారాల్లో లొంగిపోతారా లేదా అన్నది చూడాలి. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ అగ్నిమాపక విభాగానికి సంబంధించి నిధుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. దీంతో సంజయ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ మంజూరైంది.
ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది.. ఈ పిటిషన్పై జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ తీర్పు వెలువరించింది. అయితే ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా.. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ను పూర్తి చేసినట్లుగా ఉందంటూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు సంజయ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ 49 పేజీల తీర్పు ఇవ్వడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిల్ దశలోనే కేసు ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది.
ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. అగ్నిమాపశాఖకు సంబంధించి ప్రతి సదస్సుకు 350మంది హాజరైనట్లు చూపించారని.. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాకుండా 350మంది హాజరుకావడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ముఖ్యమైన హోదాల్లో ఉన్నవారు అన్ని సరిచూసుకోవాలని, ఇలా ఇష్టానుసారం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖకు సంబంధించి వెబ్సైట్, యాప్లతో పాటుగా పలు అంశాలకు సంబంధించి.. ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి.
అలాగే సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్లు ఇచ్చారు.. అక్కడా సదస్సులు నిర్వహించకుండా బిల్లులు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అగ్నిమాపకశాఖ, సీఐడీ బాధ్యతల్ని సంజయ్ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు చేసి రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే ఆయన కోర్టుల్ని ఆశ్రయించారు.