ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో కెరీర్ కోరుకునే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 185 వైద్యుల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో సేవలందించేందుకు ఈ నియామకాలను ఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 185 పోస్టుల్లో 155 ఎంబీబీఎస్ వైద్యుల కోసం కేటాయించారు. మిగిలిన 30 పోస్టులు స్పెషలిస్టు వైద్యుల కోసం. వీటిలో 14 చిన్నపిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు), 3 గైనకాలజిస్టులు, 13 టెలిమెడిసిన్ హబ్ వైద్యుల ఖాళీలు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 లోపు దరఖాస్తులు సమర్పించాలి. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం https://apmsrb.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.