ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈఓ ఆంటోనీ షా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల బృందాన్ని సిడ్నీలో కలిశారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక వాతావరణాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, శక్తివంతమైన మానవ వనరులు, సులభతర వాణిజ్య విధానాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారాయని ఆయన వివరించారు. ఏపీలోని ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వచ్చే నెల 14 మరియు 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 కు హెచ్ఎస్బీసీ ప్రతినిధులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సమ్మిట్ ద్వారా ఏపీ ప్రభుత్వంతో గ్లోబల్ కంపెనీలు కలిసి పనిచేసే కొత్త భాగస్వామ్యాలకు నాంది పలుకుతుందని చెప్పారు.
ఆస్ట్రేలియాలోని పెట్టుబడిదారులు కూడా ఏపీలో వ్యాపార విస్తరణకు ఆసక్తి చూపుతున్నారని లోకేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు పారదర్శకత, వేగవంతమైన అనుమతులు, స్థిరమైన విధానాలే మా ప్రధాన ప్రాధాన్యతలు. ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్పై నమ్మకంతో ముందుకు వస్తున్నాయి. ఈ విశ్వాసం మరింత బలపడేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
హెచ్ఎస్బీసీ సీఈఓ ఆంటోనీ షా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహక విధానాలు చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు. రాబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల అవకాశాలను మరింతగా పరిశీలిస్తామని చెప్పారు.
ఈ భేటీతో ఏపీ ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల ప్రవాహానికి మరొక ముఖ్య మైలురాయి చేరిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. లోకేష్ నేతృత్వంలోని ఈ పర్యటన రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.