ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబంపై ముదురు నీడలు కమ్ముకున్నాయి. తాజాగా వెలుగులోకి వస్తున్న లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి పేరు కూడా వినిపిస్తోంది. చెన్నై కేంద్రంగా నడుస్తున్న కార్పొరేట్ స్కామ్, సూట్కేస్ కంపెనీలు, గల్ఫ్ దేశాలకు ఎగుమతుల పేరుతో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన చెన్నైలోనే ఈ స్కామ్ మాస్టర్ ప్లాన్ పుట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ బయటపడగానే, వెనుకపుటలపైన కదులుతున్న కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. జగన్ సోదరులుగా పేరుపొందిన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇద్దరూ దేశవిదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయి. సునీల్ రెడ్డి చెన్నైలో షిలోహ్ ఇండస్ట్రీస్ పేరిట వ్యాపారాలు నడిపితే, అనిల్ రెడ్డి ఫోరెస్ ఇంపెక్స్ కంపెనీలను నడిపుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీల ద్వారానే అనుమానాస్పద ఎగుమతులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ కుటుంబ వ్యాపారాల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. జార్జి రెడ్డి కుమారులైన అనిల్, సునీల్ రెడ్డి ఒక్కసారిగా శ్రీమంతులైపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సూట్కేస్ కంపెనీల పేరుతో కోట్లాది రూపాయలు కదలాడి, కార్పొరేట్ ముసుగులో అంతర్జాతీయ కుట్రలు జరిగాయని విచారణలో తేలుతోందని సమాచారం. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఏర్పాటైన కంపెనీలు పెద్దఎత్తున లావాదేవీలకు వేదికైనట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు జగన్ పేరు నేరుగా బయటకు రాకపోయినా, ఈ కేసులో ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రతి అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. లిక్కర్ స్కామ్ వెనుక దాగిన పెద్ద నెట్వర్క్ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో, వైఎస్ కుటుంబం మళ్లీ రాజకీయ దుమారంలో చిక్కుకుంది. అంతర్జాతీయంగా విస్తరించిన ఈ బాగోతం ఎక్కడ ఆగుతుందో? ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తారాస్థాయికి చేరాయి.