ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండకోనల్లో అంతరించిపోతున్న, అరుదైన కోయ భాషలకు ఊపిరిలూదేలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గోదావరి, శబరి నదీ తీర ప్రాంతాలలో ఉన్న 12 గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు కోయ భాషను బోధించడానికి నేటివ్ స్పీకర్లను నియమించనుంది. గోదావరి, శబరి నదుల వెంట ఉన్న 12 ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో 15 మంది నేటివ్ స్పీకర్లను నియమించనున్నారు. ఈ నేటివ్ స్పీకర్లుగా కోయ మాతృభాష మాట్లాడే వారిని నియమించనున్నారు. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ.. అల్లూరి జిల్లా చింతూరు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది.
మాతృభాష ఆధారిత బహుభాషా విద్యాబోధన (Mother Tongue Based Multilingual Education) కింద ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అల్లూరి జిల్లాలోని వి.ఆర్. పురం మండలంలో ఉన్న ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఏడుగురు నేటివ్ స్పీకర్లు, యేటపాక మండలంలో ఉన్న ఐదు పాఠశాలలకు ఏడుగురుని, చింతూరు మండలంలోని వెగితోట స్కూలుకుఒక నేటివ్ స్పీకర్ను నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆయా పాఠశాలల నిర్వహణ కమిటీలు గ్రామాలలో కోయ భాష మాట్లాడేవారిని గుర్తించి, నేటివ్ స్పీకర్లుగా నియమించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల నిర్వహణ నిధి నుంచి ఈ నేటివ్ స్పీకర్లకు గౌరవ వేతనం (Honorarium) చెల్లించనున్నారు. కోయ తెగలకు చెందిన ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థులకు నేటివ్ స్పీకర్లు.. వారి మాతృభాషలో చదువు చెప్పనున్నారు. గిరిజన తెగలైన కోయల సంస్కృతిని, వారసత్వాన్ని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం తాజా ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు గతంలోనే ఏపీ ప్రభుత్వం లిపి లేని కోయ భాషలకు అక్షర రూపం కల్పించి.. కోయ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే కోయ భారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాతృభాష తప్ప మరో భాష రాని గిరిపుత్రులు.. విద్యకు దూరమైపోతున్నారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో కోయ భాష అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు కోయ భాషలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజనులకు వారి మాతృభాషలోనే తెలుగును సులువుగా అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పుస్తకాలు కూడా ముద్రించి పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలలో కోయ భాషను, కర్నూలు, అనంతపురం జిల్లాలో సుగాలి భాషను, విశాఖ జిల్లాలో కొండ, కువి, ఆదివాసీ భాషలను, విజయనగరం జిల్లాలో సవర భాషలకు అనుగుణంగా పుస్తకాలు తీసుకువచ్చారు.