పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశమైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. “పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. కానీ ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు” అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని కూడా గ్రంధి తెలిపారు.
గ్రంధి శ్రీనివాస్, 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. భీమవరం ప్రస్తుతం పేకాట క్లబ్ల వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
గ్రంధి మాట్లాడుతూ, “14 నెలలుగా క్లబ్ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్నారు. కానీ రెండు నెలలుగా ఆదాయం తగ్గడంతో వారు పోలీసు అధికారిపై దాడి మొదలుపెట్టారు. ఆ అధికారి మీద పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం చాలా దారుణం” అని అన్నారు. పోలీసులు పేకాట కార్యకలాపాలను ఆపినప్పుడు కొందరికి అది నచ్చలేదని, అందుకే వారు అధికారులను టార్గెట్ చేశారని ఆయన తెలిపారు.
అతను ఇంకా వివరించారు — “కొత్త ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రెండు నెలలుగా మాత్రమే క్లబ్లు మూతపడ్డాయి. కానీ 14 నెలల పాటు నిరభ్యంతరంగా పేకాట సాగింది. ప్రతి క్లబ్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికార కూటమికి చెందిన వ్యక్తులు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కో బ్రాండీ షాప్ నుంచి నెలకు రూ.4.5 లక్షలు తీసుకున్నారని కూడా వినిపిస్తోంది” అని అన్నారు.
డీఎస్పీ జయసూర్య విషయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సరికేనని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. “అసలు దొంగ ఎవరన్నది పవన్ కళ్యాణ్ తెలుసుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. ఆయన చర్యలు తీసుకుంటే నిజం వెలుగులోకి వస్తుంది” అని అన్నారు. పేకాట వ్యవహారంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీసుకున్న చర్యలు సరైనవని, వారికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని గ్రంధి తెలిపారు.ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీ, జనసేన మధ్య కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.