తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు సూర్యలంక బీచ్, నిజాంపట్నం హార్బర్ బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయం ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్నదని పోలీసులు తెలిపారు.
తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా మారింది. అలలు ఎగిసి పడుతూ తీరప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానిక మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు, స్థానికులు బీచ్ ప్రాంతాలకు చేరకూడదని అధికారులు సూచించారు.
ప్రతి సంవత్సరం కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానం చేయడం ఒక సాంప్రదాయం. ఆదివారం రోజు ఈ పుణ్యస్నానాల కోసం వేలాది మంది భక్తులు సూర్యలంక, నిజాంపట్నం బీచ్లకు చేరుకునే అవకాశం ఉండటంతో, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సముద్రం ఉప్పొంగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, బీచ్ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలను వేడుకుంటున్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. తీరప్రాంతాల్లో NDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. మత్స్యకార పడవలను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిని కూడా అధికారులు పూర్తి చేశారు.
ఇక పర్యాటక శాఖ అధికారులు కూడా తీరప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీచ్ ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించి, ప్రజలు బీచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. సూర్యలంక, నిజాంపట్నం బీచ్ ప్రవేశ మార్గాలను తాత్కాలికంగా మూసివేయడంతో పర్యాటకులు కొంత నిరాశ వ్యక్తం చేశారు.
అయితే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “మీ భద్రతే మా ప్రాధాన్యం. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే బీచ్లను మళ్లీ తెరవబడతాయి. అప్పటి వరకు ఇంట్లోనే ఉండి వర్షం, గాలుల తీవ్రత తగ్గేవరకు వేచి ఉండండి” అని సూచించారు.
ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, తుపాన్ ప్రభావం వచ్చే 24 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఈ తాత్కాలిక మూసివేత చర్య భద్రతా పరంగా అత్యంత సమంజసమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.