తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు భయాందోళన సృష్టించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలు.. అలాగే రాజ్భవన్, బీజేపీ కార్యాలయాలకు అజ్ఞాత వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
సమాచారం అందిన వెంటనే బాంబ్ డిస్పోసల్ బృందాలు, స్నిఫర్ డాగ్స్ సంఘటనా స్థలాలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు జరిపాయి. ఎక్కడా పేలుడు పదార్థాలు కనుగొనబడకపోవడంతో అవి తప్పుడు బెదిరింపులేనని తేల్చారు. అయినప్పటికీ అల్వార్పేటలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్భవన్ చుట్టూ భద్రతా వలయాలు పెంచి హై అలర్ట్ లో ఉంచారు. కాల్స్ మూలాలను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గతంలో సైతం సీఎం స్టాలిన్, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ తరహా లోనే బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వరుస ఫేక్ ఘటనలతో తమిళనాడులో పెద్ద సెన్సేషన్గా మారాయి. ఈ విధమైన కాల్స్ ప్రజల భద్రతా వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి రాకూడదని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్కు Z-ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. వరుసగా రెండో సారి కూడా ఇలా కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం సృష్టించడమే సదరు కాల్స్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరహా వారిని త్వరగా అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధిస్తే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి రిపీట్ అవ్వవని అంటున్నారు.

ఇక వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సదరు మెయిల్ ఐడీల వివరాలు సేకరించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. అయితే ఐపీ అడ్రస్ లు మారుస్తున్న తరుణంలో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని అంటున్నారు. ఈ వరుస ఘటనల నేపధ్యంలో ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. మరి రానున్న రోజుల్లో అయిన వీటికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.