2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే ‘తల్లికి వందనం’, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అమల్లో ఉన్నాయి. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఇప్పుడు మరో హామీ అయిన ఆడబిడ్డ నిధి పథకం పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నిధులు అందించనున్నారు. నంద్యాల జిల్లా గడివేములలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మరిన్ని ప్రకటనలు చేశారు:
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
ఆలయ పూజారులకు నెలకు రూ.10 వేలు
కాల్వబుగ్గ ఆలయ అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు
ఇదే కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో మాట్లాడుతూ, ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికే మిగతా హామీలన్నింటినీ అమలు చేశామని, ఆ పథకం ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని తెలిపారు.