- రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం.!
- ఇది రాజకీయ యాత్ర కాదు, నా ఆత్మీయ యాత్ర..
- చంద్రబాబు అరెస్టైన వేళ సుప్రీంకోర్టు వద్ద మొక్కు..
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన మాటల్లో ఉండే వేగం, వ్యక్తుపట్ల చూపే విధేయత ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆయన ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించారు. తన ఇలవేల్పు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి తాను గతంలో మొక్కుకున్న మొక్కును చెల్లించుకోవడానికి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కేవలం దర్శనం కోసమే కాకుండా, ఒక దార్శనికుడి కోసం తాను పడ్డ మనోవేదనకు దేవుడు సమాధానం చెప్పినందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
బండ్ల గణేశ్ ఈ పాదయాత్రను ఎందుకు తలపెట్టారనే విషయాన్ని స్వయంగా ఆయనే మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై జైలుకు వెళ్లినప్పుడు బండ్ల గణేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలోని సుప్రీంకోర్టు గడపపై నిలబడి, "చంద్రబాబుపై ఉన్న అభాండాలు తొలగిపోవాలి, ఆయన క్షేమంగా బయటకు రావాలి" అని వేడుకున్నారు. అలా జరిగితే తన ఇంటి గడప నుంచి తిరుమల కొండ దాకా నడిచి వస్తానని మొక్కుకున్నారు.
ఇటీవల చంద్రబాబుపై ఉన్న కేసులన్నీ కొట్టేయడం, ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, పాత వైభవం తిరిగి రావడంతో బండ్ల గణేశ్ మనసు కుదుటపడింది. ఆ మొక్కు తీర్చుకోవాలని ఇప్పుడు యాత్రకు శ్రీకారం చుట్టారు. బండ్ల గణేశ్ తన పాదయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించబోతున్నారు. రేపు (జనవరి 19, సోమవారం) ఉదయం 9 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన నివాసం నుంచి యాత్ర మొదలవుతుంది.
తన అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని, ఇంటి గడప వద్ద కొబ్బరికాయ కొట్టి అడుగు ముందుకు వేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని ఆయన స్పష్టం చేశారు. "ఇది నా వ్యక్తిగత మొక్కుబడి. శేషాచలం కొండ నన్ను పిలుస్తోంది, అందుకే వెళ్తున్నాను" అని బండ్ల గణేశ్ భావోద్వేగంతో తెలిపారు. బండ్ల గణేశ్ పాదయాత్ర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తన ఆరాధ్య దైవంపై మరియు తనకు ఇష్టమైన నాయకుడిపై చూపిస్తున్న ఈ అనురాగం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల వాడి దయతో బండ్ల గణేశ్ పాదయాత్ర సాఫీగా సాగాలని అందరూ కోరుకుంటున్నారు.