హారర్ థ్రిల్లర్ సినిమాల అభిమానులను ఆకట్టుకుంటూ ‘కిష్కింధపురి’ సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా తన విజయపథంలో ముందుకు దూసుకెళ్తోంది. అక్టోబర్ 24 నుండి తెలుగు కాకుండా కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం, తొలి వారంలోనే అరుదైన 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల రికార్డును నమోదు చేసింది.
అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు సుమారు 30 కోట్ల రూపాయల వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటోంది. అక్టోబర్ 17న డిజిటల్ ప్రీమియర్గా విడుదలైన ఈ సినిమా, కేవలం తెలుగు భాషలోనే మొదటి వారంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటడం విశేషం.
ఇప్పుడు ఈ సినిమా ఇతర దక్షిణ భారత భాషల్లో కూడా అందుబాటులోకి రావడంతో, రానున్న వారాల్లో మరిన్ని రికార్డులను తిరగరాయనుందనే అంచనాలు ఉన్నాయి.
‘కిష్కింధపురి’ ఒక వణికించే హారర్ థ్రిల్లర్గా రూపొందింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి నిర్మాణం చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా, సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథ సువర్ణమాయ అనే రేడియో స్టేషన్లో ఉన్న వేదవతి అనే ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఆ దెయ్యం నుంచి ఒక చిన్న పాపను రక్షించే ప్రయత్నం కథలో ప్రధానాంశంగా ఉంటుంది. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్గా నటించారు.
వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్తో కలిసి “ఘోస్ట్ వాకింగ్” పేరుతో టూర్స్ నిర్వహిస్తూ, పాడుబడిన బంగ్లాలలోకి తీసుకెళ్లి దెయ్యాల కథలతో థ్రిల్ పంచుతుంటారు. ఈ సారి, వారు ఎదుర్కొన్న నిజమైన ఆత్మతో ప్రారంభమవుతుంది అసలైన హారర్ జర్నీ.
సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్ల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీలో కూడా కొనసాగిస్తోంది.