APCRDA పరిధితో స్పష్టంగా జీవో 207, 2015 లోనే ఇచ్చినా.. సరిగా చూడకుండా మాట్లాడతారా?
జగన్.. ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు -పట్టాభి..
అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలోని అభివృద్ధి అంశంపై రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.
సీఆర్డీఏ పరిధి మొత్తం 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఆయన తెలిపారు. బందరు సమీపంలోని చల్లపల్లి, మోపిదేవి నుంచి గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఈ పరిధి విస్తరించి ఉందని వివరించారు. కేవలం అమరావతి మాత్రమే కాదు, మొత్తం సీఆర్డీఏ పరిధిలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విజన్ వల్లే ఈ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. సీఆర్డీఏ మ్యాప్ను చూస్తే ఆయన దూరదృష్టి ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్పై విమర్శలు చేస్తూ, “మూడు ముక్కలాట నాటకం ముగిసిపోయింది.. ఇప్పుడు కొత్తగా ‘మావిగన్’ అంటూ మరో నాటకం మొదలైంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న అసహనంతోనే జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
సీఆర్డీఏ చట్టంపై కూడా పట్టాభి ప్రశ్నలు లేవనెత్తారు. “సీఆర్డీఏ అవసరం లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారు? ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయలేదా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే 2015లోనే జీఓ 207 ద్వారా సీఆర్డీఏ పరిధిని స్పష్టంగా నిర్ణయించారని, అవి తెలుసుకోకుండా మాట్లాడటం సరి కాదని విమర్శించారు.
అలాగే బిల్లు, తీర్మానం మధ్య తేడా కూడా జగన్ బృందం అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్ని నాటకాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి, సీఆర్డీఏ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీస్తూ, మాటల తూటాలు పేలుతున్నాయి.