AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే ఉగాది కానుకను అందించింది. గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సమగ్ర 'జాబ్ క్యాలెండర్'ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించి, నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేరుస్తూ మంత్రి నారా లోకేష్ ఈ వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ క్యాలెండర్ ప్రకారం, మే నెల నుంచే నోటిఫికేషన్ల సందడి మొదలుకానుంది. మొదటగా మే 15వ తేదీన ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆగస్టు 15వ తేదీన భారీ స్థాయిలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందులో గ్రూప్-1 విభాగానికి సంబంధించి 91 పోస్టులు, పోలీస్ విభాగంలో అత్యధికంగా 2,778 పోస్టులు ఉండటం విశేషం. మిగిలిన ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న 928 ఖాళీలను కూడా అదే రోజున నోటిఫై చేయనున్నారు.
నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసే గ్రూప్-2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఇందులో సుమారు 750 పోస్టులు ఉన్నాయి. అదే రోజున ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం 503 ఏఈఈ (AEE) పోస్టులు, మరో 506 ఇతర సాంకేతిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. వీటితో పాటు అక్టోబర్ 15న విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న 3,004 టీచర్ పోస్టులకు (పాఠశాల మరియు ఇంటర్ విద్య) నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం" అని పేర్కొన్నారు. కేవలం నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా, నిర్ణీత సమయంలోగా పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా సిలబస్ను కూడా ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఇకపై ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం ఒక సంప్రదాయంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
చివరగా, అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి 'నైపుణ్యం' పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పరీక్షల తేదీలు, సిలబస్ మార్పులు వంటి వివరాలు నేరుగా అభ్యర్థుల మొబైల్స్కు అలర్ట్స్ రూపంలో వస్తాయని అధికారులు తెలిపారు. చాలా కాలం తర్వాత ఒకేసారి పది వేలకు పైగా పోస్టులకు స్పష్టమైన షెడ్యూల్ రావడంతో, అభ్యర్థులు ఇప్పుడు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఈ ఏడాది ఏపీలో ఉద్యోగాల జాతర మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.