HormuzStrait: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ రైతులపై, ముఖ్యంగా బియ్యం ఎగుమతిదారులపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' దాదాపు స్తంభించిపోయింది. దీనివల్ల భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే బాస్మతి బియ్యం సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
సాధారణంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా దాదాపు 40 శాతం. అంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ప్రతి ఐదు బియ్యం బస్తాల్లో రెండు భారత్ నుంచే వెళ్తాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలు మన బాస్మతి బియ్యానికి ప్రధాన మార్కెట్లు. తాజా గణాంకాల ప్రకారం, మన ఎగుమతుల్లో సౌదీ అరేబియాకు 16.3 శాతం, ఇరాన్కు 14.5 శాతం వాటా ఉంది. ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ దేశాలకు సరుకు చేరవేయడం కత్తిమీద సాములా మారింది.
యుద్ధ భయంతో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. చాలా కంపెనీలు తమ ఓడలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయడమో లేదా సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపడమో చేస్తున్నాయి. దీనివల్ల ఓడల అద్దె ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. పాత ఆర్డర్లను ఎలాగోలా పంపుతున్నా, కొత్త బుకింగ్స్ తీసుకోవడానికి షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో గల్ఫ్ దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.
భారత్లో బియ్యం ఉత్పత్తి ప్రధానంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే బియ్యం గల్ఫ్ దేశాల ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఈ సముద్ర మార్గం మరికొన్ని రోజులు మూతబడితే, అక్కడ ఆహార కొరత ఏర్పడటమే కాకుండా, భారతీయ ఎగుమతిదారులకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల వద్ద ఉన్న నిల్వలు మరికొంత కాలం సరిపోవచ్చు. కానీ యుద్ధం ముదిరితే మాత్రం పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం, మన వంటింట్లో ఉండే బాస్మతి బియ్యం ధరను ఎలా మారుస్తుందో ఈ పరిస్థితులే నిదర్శనం.