- Politics: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. నార్మన్ ఫోస్టర్ డిజైన్లు: అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం..
- మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి అంధకారం: వైసీపీ హయాంలో రాజధాని విధ్వంసాన్ని వివరించిన మంత్రి..
Narayana Comments On ycp: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఎదురైన సవాళ్లు, అమరావతి రాజధాని ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రజలంతా రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరినప్పటికీ, నాటి పాలకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని విభజించారని ఆయన విమర్శించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని, విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచినప్పటికీ, సొంత గడ్డపై పరిపాలన సాగించాలనే సంకల్పంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిని ఎంపిక చేశామని, 2014లో ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని మంత్రి గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణం కోసం ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి, 29 వేల మంది రైతుల నుంచి సుమారు 30 వేల ఎకరాల భూమిని ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కౌలుతో పాటు నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం, ఐకానిక్ భవనాల కోసం అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన నార్మన్ ఫోస్టర్ సంస్థతో డిజైన్లు సిద్ధం చేయించామన్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై విషప్రచారం మొదలుపెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిలో భూకంపాలు వస్తాయని, వరదలు ముంచెత్తుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, రివర్ బెడ్ మరియు రివర్ బేసిన్ కు మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని విమర్శించారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ అర్థరహితమైన వాదనలు చేస్తూ, రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులను రెచ్చగొట్టి, వారి త్యాగాలను కించపరిచేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి గత పాలకులు పన్నిన కుట్రలను అధిగమించి, ఇప్పుడు మళ్లీ రాజధాని పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.