వేసవి నెలల్లో దాహాన్ని హరిస్తూ శరీరాన్ని చల్లబరచే సహజమైన పండు ఐస్ ఆపిల్. దక్షిణ భారత రాష్ట్రాల్లో తాటి ముంజలు అని అంటారు. తమిళనాడులో ‘నుంగు' మహారాష్ట్ర–గోవా ప్రాంతాల్లో ‘తడ్గోలా’ పేర్లతో పిలువబడే తాటి ముంజులు మన దేశంలోనే అత్యంత విస్తారంగా లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఈ తాటి చెట్లు పెరిగినా భారీ ఉత్పత్తి మాత్రం ఒక్క భారత్దే.
ఉష్ణ మండల వాతావరణం దీర్ఘకాలిక ఎండలు, సహజ వర్షపాతం ఈ మూడు కలిసినప్పుడు తాటి చెట్లు విస్తారంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. అదే కారణంగా భారతదేశం ప్రపంచంలో ఐస్ ఆపిల్ అత్యధికంగా పండించే దేశంగా నిలుస్తోంది.భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో తాటి చెట్ల విస్తృతి అత్యధికం. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ పండు విస్తారంగా ఉత్పత్తి అవుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లోనీ, నగరాలకు సమీప ప్రాంతాల్లోనీ రైతులు సహజంగా పెరిగే తాటి చెట్ల నుంచి ముంజలను సేకరించి మార్కెట్కు తరలిస్తారు. వేసవి కాలంలో వీటి డిమాండ్ విపరీతంగా పెరగడంతో ధర కూడా పెరుగుతుంది. ముంజలు నేరుగా తినడమే కాక, పలువురు జ్యూసులు, శీతల పానీయాలు, ఆహార పదార్థాలు తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. నీరు అధికంగా ఉండటం, సహజ మాధుర్యం, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది వేడి తరిమే ముజ్జికాయగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
తాటి చెట్లు దీర్ఘాయుష్షు కలవని వందేళ్లకు పైగా నిలిచే సామర్థ్యం ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక్క చెట్టే ఎన్నో తరాలకు ఆపన్నముగా నిలుస్తూ పండ్లు, కర్రలు, ఆకులు, తాటి బెల్లం, తాటి నీరు వంటి అనేక వనరులను అందిస్తుంది. నీరుపారుదల అవసరం లేకుండానే పెరిగే ఈ చెట్లు పర్యావరణ రక్షణకు కూడా ఎంతో తోడ్పడతాయి. తీర ప్రాంతాల్లో మట్టిని గాలివేగాల నుంచి కాపాడే సహజ రక్షణ కవచంగా కూడా అవి విరాజిల్లుతాయి.
భారత్తో పాటు థాయ్లాండ్, కంబోడియా, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ ముంజు కాయలు (ఐస్ ఆపిల్) లభిస్తాయి. అయితే అక్కడి ఉత్పత్తి ప్రధానంగా స్థానిక వినియోగానికే పరిమితం అవుతోంది. ఈ దేశాల్లో తాటి చెట్లను పామ్ షుగర్, తాటి బెల్లం తయారీకి విస్తారంగా ఉపయోగిస్తారు. కాని భారత్లో జనాభా భారీగా ఉండటం, వేసవి ఎక్కువకాలం కొనసాగటం, ప్రజల డిమాండ్ ఎక్కువగా ఉండటం ఈ మూడు భారతాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ముంజు కాయలు(ఐస్ ఆపిల్ ) ఉత్పత్తిదారుగా నిలిపాయి.
ప్రపంచ వాతావరణ మార్పులతో సహజ శీతల పండ్ల ప్రాముఖ్యత మరింత పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే సంవత్సరాల్లోనూ భారత్ ముంజు కాయలు ఉత్పత్తి కేంద్రంగా నిలిచే అవకాశాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి. రైతులకు తక్కువ పెట్టుబడి–అధిక లాభాలు ఇచ్చే ఈ పంట భవిష్యత్లో సహజ ఆర్థిక వనరుగా మారే అవకాశం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు