చాలామందికి రెస్టారెంట్లలో లభించే ఆ చిక్కటి, సువాసనభరితమైన మష్రూమ్ గ్రేవీ అంటే ఎంతో మక్కువ. కానీ అదే రుచిని ఇంట్లో తీసుకురావడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా సాధ్యమే ఎటువంటి ఖరీదైన ఇంగ్రిడియంట్స్ వాడకుండా, మన వంటింట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే అచ్చం హోటల్ రుచిని తలపించేలా మష్రూమ్ కర్రీని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకోండి మరి..
కావలసిన పదార్థాలు
ఈ కర్రీ తయారీకి 200 గ్రాముల తాజా పుట్టగొడుగులు వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, మరియు సాధారణ పోపు దినుసులు అవసరం. గ్రేవీకి అసలైన చిక్కదనాన్ని ఇచ్చేందుకు జీడిపప్పు, పచ్చి కొబ్బరి, టమాటా మరియు పెరుగును సిద్ధం చేసుకోవాలి.
మసాలా తయారీ విధానం
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకులు, నాలుగు లవంగాలు వేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, పావు ముక్క పచ్చి కొబ్బరి, ఒక మీడియం సైజు టమాటా మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు చేర్చి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దే కూరకు అద్భుతమైన రుచిని ఇస్తుంది.
తొలుత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. గ్రేవీ కూరలకు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మరియు జీలకర్ర వేసి వేయించాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసి, అది గోధుమ రంగులోకి మారి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
వంటలో అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. వేగుతున్న ఉల్లిపాయల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి, మంటను చిన్నగా ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆపై ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాలను నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. దీనివల్ల మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. చివరిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, గ్రేవీ చిక్కదనానికి తగినట్లుగా ముప్పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే నూనె పైకి తేలి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కూర సిద్ధమవుతుంది. కొత్తిమీర లేదా కసూరి మేతితో గార్నిష్ చేస్తే ఆ సువాసన ఇల్లంతా అలుముతుంది చూడండి ఆవాసరికి ఓహో అనాల్సిందే.
ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే కొబ్బరి, జీడిపప్పు గ్రేవీకి మంచి క్రీమీ టెక్స్చర్ను ఇస్తాయి. బిర్యానీ, చపాతీ లేదా వేడివేడి అన్నంతో ఈ కర్రీని వడ్డిస్తే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రెస్టారెంట్ ఫీల్ ఇచ్చే ఈ వంటకాన్ని మీరు కూడా తప్పక ప్రయత్నించండి