ప్లాస్లిక్ భూతాన్ని తరిమి.. భవితరాలకు ఆరోగ్యానిద్దాం..
ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర” కార్యక్రమం ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై కొత్త చైతన్యాన్ని నింపింది. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
పెనుకొండ గాంధీ సర్కిల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సవిత మాట్లాడుతూ “మన ఇంటి నుంచి, మన గ్రామం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలి. భావితరాలకు ఆస్తులు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందించాలి” అని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికీ, పర్యావరణానికీ తీవ్ర హాని కలిగిస్తోందని, ముఖ్యంగా మహిళలు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో చెత్తపై పన్ను వేసి ప్రజలపై భారం మోపారని, ఇప్పుడు అదే చెత్తతో సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్, సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు మేలు చేస్తున్నామని వివరించారు.
స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఇనుము వంటి వ్యర్థాలను సేకరించి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న విధానాన్ని కూడా మంత్రి వివరించారు. ప్రతి షాపు వద్ద ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్లెక్సీలు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అధిక ఎరువుల వినియోగం, ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చన్నారు. ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతులకు సూచించారు.
జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, పిల్లలను అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడం ద్వారా పారిశుధ్య నిర్వహణ సులభమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సవిత ప్రవర్తన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన పొదుపు పిలుపును పాటిస్తూ ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఎటువంటి వాహన శ్రేణి లేకుండా సాధారణ ప్రజల మధ్య కార్యక్రమంలో పాల్గొనడం అందరి ప్రశంసలు అందుకుంది.
షాపులు, తోపుడు బండ్ల వద్దకు వెళ్లి గుడ్డతో తయారు చేసిన క్యారీ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్ర సంచులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. అలాగే రోడ్లపై పడివున్న చెత్తను స్వయంగా తీసి డస్ట్బిన్లో వేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
అనంతరం గాంధీ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రజలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.