Devotional- వారి హుండీకి కాసుల వర్షం: ఈ ఏడాది రూ.1,420 కోట్ల ఆదాయం నమోదు…
గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థకు చెక్.. 'దర్శనం ఉంటేనే గది' విధానం సక్సెస్…
టీటీడీ చరిత్రలో నవశకం.. రోజుకు సగటున 73 వేల మందికి పైగా దర్శనాలు…
Tirumala Devotees: గత రెండేళ్లతో పోలిస్తే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2025-26 సంవత్సరంలో ఏకంగా 2 కోట్ల 66 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.57 శాతం వృద్ధిని సూచిస్తోంది. గతంలో సగటున రోజుకు 70 వేల మంది దర్శనం చేసుకునేవారు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 73 వేలకు చేరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక మార్పులను చేపట్టింది.
ముఖ్యంగా తిరుమలలో గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. గతంలో దర్శనంతో సంబంధం లేకుండా గదులు ఇచ్చేవారు, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు గదులను బ్లాక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 'దర్శనం ఉంటేనే గది కేటాయింపు' అనే విధానాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పూర్తిగా అగిపోయిందని, లడ్డు ప్రసాదం నాణ్యత మరియు రుచి కూడా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే 5.25 శాతం పెరిగింది. గత సంవత్సరం రూ.1,345 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రూ.1,420 కోట్లకు చేరింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూ లైన్ల నిర్వహణను పర్యవేక్షించడం, గదుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడం వంటి చర్యల వల్లే భక్తుల సంఖ్య మరియు ఆదాయం పెరిగిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీటీడీ తన పాలనను కొనసాగిస్తోంది.