శిలాతోరణం వరకు క్యూలైన్.. తిరుమలలో భారీ రద్దీ..
తిరుమలలో లక్షలాది భక్తుల రాక.. హుండీ ఆదాయం ₹3.80 కోట్లు..
తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగింది. దీంతో దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం పూర్తి కావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
ఇక గురువారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా నమోదైంది. ఒక్క రోజులోనే 74,569 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు హుండీ ఆదాయం రూ.3.80 కోట్లకు చేరింది.
లడ్డూల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజులో 4.15 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాద సేవలో భాగంగా 2.70 లక్షల మంది భక్తులు ఉచిత భోజనాన్ని స్వీకరించారు. మరోవైపు, వైద్య సేవలు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3,592 మంది భక్తులకు వైద్య చికిత్స అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సహనం పాటించాలని, దర్శనానికి వచ్చే భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని టీటీడీ సూచించింది.