సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం..
300 రూ శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, వారాంతపు రద్దీ కారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి ప్రకారం ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతున్నాయి.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల విరాళాలతో హుండీ ఆదాయం రూ.4.99 కోట్లకు చేరింది.
తిరుమలలో ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజే 4.22 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాదాల భవనంలో 2.52 లక్షల మంది భక్తులు ఉచిత భోజన సేవలను స్వీకరించారు. అలాగే వైద్యసేవల కోసం వచ్చిన 3,603 మంది భక్తులకు చికిత్స అందించినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో తాగునీరు, భోజనం, వైద్యసేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.