Sri Sathya Sai District News: అపర భక్త రామదాసులను తలపిస్తూ, శ్రీరామనవమి పర్వదినం వేళ ఒక ముస్లిం సోదరుడు భక్తి చాటుకున్నారు. అయోధ్యకు వెళ్ళలేని సామాన్య భక్తుల కోసం ఏకంగా తన సొంత గ్రామంలోనే 14 ఎకరాల భారీ విస్తీర్ణంలో 'అయోధ్య రామ మందిరం' నమూనా సెట్ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముక్తియార్ బాషా అనే వ్యక్తి చేసిన ఈ అరుదైన ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన ముక్తియార్ బాషా వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడినప్పటికీ, తన ఊరిపై మక్కువతో ఏటా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది భక్తులకు అయోధ్య వెళ్ళిన అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, ముంబైకి చెందిన నిపుణులైన కళాకారులతో ఈ ఆలయ సెట్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కేవలం భవనం మాత్రమే కాకుండా, లోపల సీతారామ, లక్ష్మణ, హనుమంత విగ్రహాలను కూడా కొలువుదీర్చారు.
ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలా మారిపోయింది. కాశీ నుంచి ప్రత్యేకంగా అర్చకులను పిలిపించి వేదమంత్రాల సాక్షిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం అన్ని రకాల వసతులు కల్పించడమే కాకుండా, అన్నదాన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా కల్పించడం గమనార్హం.
ముక్తియార్ బాషా మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల అయోధ్యకు వెళ్లలేని వారు ఈ మందిరాన్ని చూసి తన్మయత్వం చెందాలని ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో చిన్నప్పటి నుంచి అందరితో కలిసి పెరగడం వల్ల తనకు భక్తి భావం ఏర్పడిందని, మతాల కంటే మానవత్వం, భక్తి గొప్పవని ఆయన చాటి చెప్పారు. ఇప్పటికే తన గ్రామంలోని గుడికి విగ్రహాలను బహుకరించిన ఆయన, ఇప్పుడు ఈ భారీ సెట్తో భక్తుల మన్ననలు పొందుతున్నారు.
ఈ అద్భుతమైన అయోధ్య సెట్ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా కదిరి పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీరామనవమి నాడు ఇక్కడ సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఒక సామాన్య వ్యక్తి తలచుకుంటే భక్తితో ఎంతటి అద్భుతానైనా సృష్టించవచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది.