India Iran Relations: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతి, మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మధ్యవర్తిత్వ నాటకాలు ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే భారత్ వంటి 'నమ్మదగిన భాగస్వామి' అవసరమని ఆయన స్పష్టం చేయడం, అంతర్జాతీయ వేదికపై మన దేశ పరపతికి నిదర్శనంగా నిలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇప్పుడు అందరినీ అయోమయానికి గురి చేస్తోంది. ఒక పక్క ఐదు రోజుల పాటు 'యుద్ధ విరామం' అంటూనే, మరోపక్క యు.ఎస్.ఎస్. బాక్సర్ వంటి యుద్ధ నౌకలను, వేల సంఖ్యలో మెరైన్ సైనికులను, పారా ట్రూపర్లను ఇరాన్ సరిహద్దులకు పంపడం ఆయనపై నమ్మకాన్ని పూర్తిగా సడలించింది. మాట ఒకటి చెప్పి, చేతల్లో యుద్ధానికి కాలుదువ్వడం ట్రంప్ నైజమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వెనిజులా విషయంలో కూడా గడువు ఇచ్చి, కొన్ని గంటల్లోనే అక్కడి అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన చరిత్ర ఆయనకుంది. ఇలాంటి అస్థిరమైన నాయకత్వం ఉన్నప్పుడు ఏ దేశమైనా అమెరికాను ఎలా నమ్ముతుంది?
మరోవైపు, అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్ ఈ సంక్షోభంలో మధ్యవర్తిగా మారుతాననడం హాస్యాస్పదంగా మారింది. లీటర్ పెట్రోల్ 220 రూపాయలు దాటి, సామాన్యుడు బండి తీయడానికే భయపడుతున్న తరుణంలో, ఆ దేశం యుద్ధాన్ని ఆపుతుందా లేక తన సైన్యాన్ని అమెరికాకు అద్దెకు ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇరాన్పై కన్నెర్ర చేస్తున్న నేపథ్యంలో, పాకిస్తాన్ తన రక్షణ ఒప్పందాల ప్రకారం ఎవరి వైపు నిలబడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇరాన్ కమాండర్లు ఇప్పటికే పాకిస్తాన్ను హెచ్చరించారు—తమపై దాడులకు పాక్ గడ్డను వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన వాదన వినిపిస్తోంది.
ఇరాన్ ఇప్పుడు 'మొజాయిక్ డిఫెన్స్' వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అంటే ఎక్కడికక్కడ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ముప్పు అనిపిస్తే పై అధికారుల ఆర్డర్ కోసం ఎదురుచూడకుండానే దాడి చేసే అధికారం వారికి ఉంటుంది. ఇలాంటి మొండి పట్టుదలతో ఉన్న ఇరాన్, అమెరికాతో నేరుగా మాట్లాడటానికి ఇష్టపడదు. వాళ్ళు కోరుకుంటున్నది ఒక్కటే దిల్లీలో జయశంకర్ గారు కూర్చుని ఈ పంచాయతీని పరిష్కరించాలని భారత్ పట్ల వారికి ఉన్న అపారమైన నమ్మకమే దీనికి కారణం. గ్లోబల్ సౌత్ కి ప్రతినిధిగా, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న దేశంగా భారత్ మాత్రమే ఇక్కడ సరైన మధ్యవర్తి.
ట్రంప్ తన 15 పాయింట్ల ఎజెండాతో పాకిస్తాన్ ద్వారా ఏదో చేయాలని చూస్తున్నా, అది క్షేత్రస్థాయిలో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రష్యా పూర్తి మద్దతు ఉన్న ఇరాన్ను కేవలం బెదిరింపులతో లొంగదీసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచానికి గ్యాస్, ఇంధన సరఫరా సజావుగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదన్నా భారత్ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. జయశంకర్ గారి దౌత్య నీతి ఈ మంటలను ఆర్పగలదని అంతా ఆశిస్తున్నారు. ట్రంప్ తన దూకుడు తగ్గించుకోనంత కాలం శాంతి అనేది ఎండమావిగానే మిగిలే ప్రమాదం ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.