CM Breakfast Scheme 2026: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి 'ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం' కింద పిల్లలందరికీ ఉదయాన్నే రుచికరమైన టిఫిన్ పెట్టాలని నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లల నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల వరకు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి వచ్చే పిల్లలు ఆకలితో ఇబ్బంది పడకుండా, చదువుపై శ్రద్ధ పెట్టాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండేందుకు వారంలో ఆరు రోజులు రకరకాల టిఫిన్లను మెనూలో చేర్చారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇచ్చే చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసిన ఇడ్లీ, ఉప్మా వంటివి పెడతారు. సోమవారం దోసె లేదా చపాతీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-సాంబారు, బుధవారం పూరి-ఆలూ కుర్మా, గురువారం మళ్లీ ఇడ్లీ, శుక్రవారం ఉప్మా లేదా పొంగల్, ఇక శనివారం వేడివేడి బోండాలు అందిస్తారు. ఇలా రోజుకో రకం రుచితో పిల్లలకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
కేవలం టిఫిన్ మాత్రమే కాకుండా, పిల్లల ఎదుగుదల కోసం పాలు లేదా రాగిజావను కూడా ఈ మెనూలో కలిపారు. వారంలో మూడు రోజులు వేడి పాలు, మిగిలిన మూడు రోజులు బలాన్నిచ్చే రాగిజావ ఇస్తారు. పిల్లలు నిదానంగా, కడుపు నిండా తినడానికి వీలుగా ప్రతిరోజూ ఉదయం పూట 45 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నారు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, బడికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. రూ. 720 కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించారు. ఇందులో టిఫిన్ల కోసం 540 కోట్లు, పాలు మరియు రాగిజావ కోసం 180 కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే ఈ నిధులను బడ్జెట్లో సిద్ధం చేశారు. తమిళనాడులో అమలవుతున్న ఇలాంటి పథకాన్ని చూసి, మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించుకుంది.
ప్రభుత్వ బడి పిల్లలకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయమని చెప్పాలి. పౌష్టికాహారం అందడం వల్ల పిల్లల్లో రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే వేడివేడి అల్పాహారం తినడం వల్ల వారు రోజంతా ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో ఈ కొత్త మెనూ అమల్లోకి రానుంది.