Stock Market News: దిగివచ్చిన చమురు ధరలు.. దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు 2700 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!
Stock Market News: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 2,700 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లు ఎగబాకగా.. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా గణనీయంగా పెరిగింది
Stock Market News: ముడి చమురు సెగలు తగ్గి, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు సడలడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ సానుకూల పవనాలతో భారత మార్కెట్లు ట్రేడింగ్ ఆరంభంలోనే భారీ లాభాలతో దూసుకెళ్లాయి. గత కొద్ది రోజులుగా ఆందోళనలో ఉన్న ఇన్వెస్టర్లలో ఈ వార్త కొత్త ఆశలను నింపింది.
బుధవారం ఉదయం మార్కెట్లు ప్రారంభం కావడమే రికార్డు స్థాయి జంప్తో మొదలయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకు పైగా లాభపడి 77,315 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదే బాటలో నిఫ్టీ కూడా 800 పాయింట్ల మేర ఎగబాకి 23,915 మార్కును తాకింది. ప్రధానంగా చమురు ధరలు తగ్గడం వల్ల రవాణా, ఉత్పత్తి రంగాలకు చెందిన కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది.
మరోవైపు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత రూపాయిపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఒక్కసారిగా 50 పైసలు బలపడి 92.56 వద్దకు చేరింది. చమురు దిగుమతుల భారం తగ్గుతుందన్న అంచనాలతో రూపాయికి బలం చేకూరింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తొలగిపోవడం వల్ల ముడి చమురు సరఫరా పుంజుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
ట్రంప్ చొరవతో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం ద్రవ్యోల్బణ భయాలను తగ్గించడమే కాకుండా, ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచింది. సాధారణ ప్రజలకు కూడా పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో కొంత ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతుండటంతో దలాల్ స్ట్రీట్లో పండగ వాతావరణం నెలకొంది.
Be the first to react