⚡ BREAKING

మహిళా రైతులకు సర్కార్ గిఫ్ట్.. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభం.

తెలంగాణ ప్రభుత్వం మహిళా రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. దీని ద్వారా వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ, ఉచిత రుణాలు అందనున్నాయి.

మహిళా రైతులకు  సర్కార్ గిఫ్ట్.. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభం.

తెలంగాణలోని మహిళా రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే కాకుండా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 'వ్యవసాయ యాంత్రీకరణ' అనే సరికొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ఆదివారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో జరిగిన రైతు మేళాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కీలక ప్రకటన చేశారు. కేవలం కూలీలుగానే కాకుండా, యంత్రాలను నడిపే స్థాయికి మహిళా రైతులు ఎదగాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. సాగు పనులను సులభతరం చేసేందుకు అవసరమైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు  ఇతర యంత్రాలను ప్రభుత్వం భారీ సబ్సిడీతో అందించనుంది. దీనికి తోడు మహిళా రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత రుణ సదుపాయాన్ని కూడా కల్పించబోతున్నారు. దీనివల్ల మహిళలు సొంతంగా సాగు చేసుకునే వీలు కలగడమే కాకుండా, గ్రామాల్లో వారి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

వ్యవసాయ రంగంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతులను మార్చుకోవాలని మంత్రి సూచించారు. కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో యంత్రాల వాడకం అనివార్యమని, అందుకే మహిళలకు ఈ దిశగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. సాగు వ్యయం తగ్గించి, దిగుబడిని పెంచడం ద్వారా రైతు కుటుంబాల్లో వెలుగులు నింపడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని, అందుకే వ్యవసాయంలో వారికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా రైతులకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఏడాది ఒకే రకమైన పంటలు వేయడం వల్ల నేల సారం తగ్గిపోతుందని, లాభాలు కూడా ఆశించిన స్థాయిలో రావని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేలా రైతులు మారాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త పథకంపై మహిళా రైతుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చే విషయమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు మరియు సబ్సిడీ వివరాలను జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Be the first to react

Latest