- తెలిసినా వైసీపీ ప్రభుత్వం మౌనంగా…
- తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. భక్తుల నుంచి లడ్డూ నాణ్యతపై అనేక ఫిర్యాదులు అందాయని, లడ్డూలు గట్టిగా ఉండటం, సువాసన లేకపోవడం మరియు రుచిగా లేవన్న అంశాలపై విచారణ జరపగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు.
అధికారులు నెయ్యి నాణ్యతను ప్రశ్నిస్తే, అది 'ఆర్గానిక్ నెయ్యి' అని బుకాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను NDDB (National Dairy Development Board) కు పంపగా, ఆ నివేదికలో సోయాబీన్, సన్ఫ్లవర్, కోకోనట్, పామాయిల్ మరియు ఫిష్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వు కలిసినట్లు స్పష్టంగా తేలిందని వెల్లడించారు.
గత పాలకమండలి ఈ పాపంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు. 2022లోనే CFTRI నివేదిక నెయ్యి కల్తీపై హెచ్చరించినప్పటికీ, నాటి చైర్మన్ ఆ నివేదికను తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న పేరు ప్రముఖంగా వినిపించిందని, సుమారు రూ. 234 కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగమయ్యాయని పేర్కొన్నారు. కేవలం 10 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్న 'భోలేబాబా డెయిరీ' వంటి సంస్థలకు టెండర్లు కట్టబెట్టడం కోసం నిబంధనలను ఇష్టానుసారంగా మార్చారని మండిపడ్డారు.
పామాయిల్ను నెయ్యిగా మార్చడానికి, రంగు మరియు వాసన రావడం కోసం అనేక ప్రమాదకర రసాయనాలను వాడటం భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు ఉంచి తన బాధ్యతను నిర్వర్తించారని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.