పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైసీపీ రాద్దాంతం సిగ్గుచేటు..
ఎవరెన్ని కుట్రలు చేసినా బందరుని అభివృద్ధి చేసి చూపిస్తా..
మచిలీపట్నం: “రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం” అంటూ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంగా హెచ్చరించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహిస్తూ ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన గ్రీవెన్స్లో మొత్తం 409 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎక్కువ భాగాన్ని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం 57 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్లు, ఉద్యోగాలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మే నెలలో జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈ, ఫిషరీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నమోదు చేసుకున్న వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
మచిలీపట్నం అభివృద్ధిపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ముఖ్యంగా పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్దాంతాన్ని తప్పుపట్టారు. అక్కడ ప్రధాన సమస్య మురుగు నీరేనని, దాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.50 కోట్లతో రెండు ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలు వచ్చినా మురుగు నీరు పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అభివృద్ధి చేయలేని వారు, నిధులు తెచ్చుకోలేని వారు ఇతరులు చేసే పనులను విమర్శించడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. బందరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు. పేర్ని కిట్టు వర్గంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ, అధికారులను బెదిరించడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం తప్ప వారు సాధించినదేమీ లేదని అన్నారు.
ఇక బందరు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రైనేజీ, రోడ్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రూ.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, పోలాటితిప్ప–గరాలదిబ్బ రోడ్, నడమేరు–కొండేరు బ్రిడ్జికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
పేదల గృహ నిర్మాణంపై కూడా మంత్రి దృష్టి సారించారు. ఇప్పటికే జీ+3 ఇళ్లు నిర్మించి పేదలకు అందించామని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అలాగే బందరు పోర్టును పూర్తి చేసి, దాన్ని ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మార్చుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, మోటమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.