జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం..
ఎవరి ప్రయోజనాల కోసం సభ్యుల రాజీనామాలను తిరస్కరిస్తున్నారో చైర్మన్ చెప్పాలి..
అమరావతి: శాసన మండలి సభ్యుల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై పదవిలోకి వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ రాజీనామాను చైర్మన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
జయమంగళం వెంకటరమణతో పాటు కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, చక్రవర్తి, పోతుల సునీత, జాకియా ఖానం తదితరులు వైసీపీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. 2024 నవంబర్లో రాజీనామాలు సమర్పించినప్పటికీ దాదాపు ఏడాది గడిచినా వాటిపై నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. సభ్యులు లిఖితపూర్వకంగా మాత్రమే కాకుండా సభలో కూడా తమ రాజీనామాలను ఆమోదించాలని కోరినా చైర్మన్ స్పందించలేదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా, చైర్మన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికీ స్పందించలేదని చెప్పారు. దీంతో 2025 సెప్టెంబర్లో కోర్టు రూ.10,000 జరిమానా విధించి, 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. ఒక చైర్మన్పై కోర్టు జరిమానా విధించడం చాలా అరుదైన విషయం అని అన్నారు.
ఏపీ శాసనమండలి రూల్ నెం.190 ప్రకారం సభ్యుడు ఎవరి ద్వారా అయినా రాజీనామా లేఖను పంపవచ్చని, చైర్మన్ సభ్యుడిని పిలిచి అది స్వచ్ఛందమా కాదా తెలుసుకోవచ్చని వివరించారు. సభ్యులు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని స్పష్టం చేసినప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అసలు ఈ ఆలస్యం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చైర్మన్ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
చైర్మన్ తీరు ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వేపాడ చిరంజీవి విమర్శించారు. స్పీకర్గా పనిచేసిన సోమనాథ్ ఛటర్జీను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యత చైర్మన్దని చెప్పారు.
ఒక సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించడం సహజ ప్రక్రియ అని, దాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చైర్మన్ రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
మహాభారతంలోని కర్ణుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ, మంచి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలే అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని అన్నారు. శాసన మండలి గౌరవాన్ని కాపాడుతూ, ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చైర్మన్ వ్యవహరించాలని వేపాడ చిరంజీవి కోరారు.