ఎంఎంస్ఎంఈల బలోపేతంపై ప్రభుత్వ చర్యలు వివరించిన మంత్రి కొండపల్లి..
ఏపీలో ర్యాంప్ అమలుపై ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల హర్షం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) అభివృద్ధికి చేపట్టిన ‘ర్యాంప్’ (Raising and Accelerating MSME Performance) కార్యక్రమం అమలును ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి వారు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
మంగళగిరిలోని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్తో కలిసి ఈ బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎంఎస్ఎంఈల అభివృద్ధిలో క్రమబద్ధీకరణ (ఫార్మలైజేషన్), మార్కెట్ లింకేజీలు, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రైజ్’ (OFOE) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 19 ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి వచ్చాయని, మరో 82 పార్కులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇవి కూడా త్వరలో పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవగాహన కార్యక్రమాలు, పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచే చర్యలు, వ్యాపార సౌలభ్యం పెంపు వంటి అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి వివరించారు. ఈ చర్యల వల్ల చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫలితాల ఆధారిత విధానాన్ని మెచ్చుకుంది. ర్యాంప్ అమలులో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని అభిప్రాయపడింది.
ఈ సమావేశంలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అంకిత పాండే, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆదర్శ్ కుమార్, హర్ష్ ఝంజారియా, కేంద్ర ప్రతినిధులు డాక్టర్ మిలన్ శర్మ, డాక్టర్ అతుల్ ఇనామ్దార్, ఎంఎస్ఎంఈ అధికారులు డాక్టర్ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.