ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చదివితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు..
దాతల సహకారంతోనే విద్యార్థులకు ఉచితంగా సైకిల్లు..
అద్దంకి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ధీటుగా చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముక్తేశ్వరం, చెన్నుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 96 మంది విద్యార్థులకు మంత్రి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో ఈ సైకిళ్లు అందించామని తెలిపారు. ఇప్పటివరకు అద్దంకి నియోజకవర్గంలోనే దాదాపు 11,200కు పైగా సైకిళ్లు విద్యార్థులకు అందించామని వెల్లడించారు.
విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందిస్తున్నామని తెలిపారు. “తల్లికి వందనం” పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున అందిస్తున్నామని చెప్పారు.
గతంలో ఒక్కో పాఠశాలకు ఒక్క టీచర్ మాత్రమే ఉండేవారని, దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా 16,400 టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందేలా చూసే బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు కూడా అప్పుడప్పుడు పాఠశాలల్లో భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. రైతు భరోసా, ఉపాధి హామీ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అనే విషయాల్లో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సందర్భంగా బల్లికురవలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు, ప్రభుత్వం నుంచి రూ.1 కోటి సీఎజీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
తదుపరి ఎస్సీ కాలనీలో 30 ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్టాప్ యూనిట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.1.25 లక్షల విలువైన 2 కిలోవాట్ సోలార్ యూనిట్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 3 కిలోవాట్ సోలార్ కనెక్షన్ తీసుకునే బీసీలకు రూ.98 వేల సబ్సిడీ, ఓసీలకు రూ.78 వేల సబ్సిడీ ఇస్తామని వివరించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా రూ.8 వేల కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లో కూడా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.