ప్రధాని మోదీ సూచించిన 8 అంశాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి..
ఒకటీ రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పొదుపు చర్యలను ప్రతి పౌరుడు బాధ్యతగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
అమరావతిలో మాట్లాడిన ముఖ్యమంత్రి, యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రధాని సూచించిన 8 ముఖ్య అంశాలను ప్రజలంతా పాటించాలని సీఎం కోరారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన వినియోగం తగ్గితే విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని వివరించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం భవిష్యత్తులో మరింత అవసరమయ్యే పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచే ప్రపంచవ్యాప్తంగా పనులు జరిగే రోజులు ముందున్నాయని, ఈ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలో కూడా అవసరమైతే ఈ తరహా విధానాలు అమలు చేసే పరిస్థితులు వస్తాయని తెలిపారు.
అలాగే దేశంలో దుబారాను తగ్గించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం అన్నారు. పెద్ద కాన్వాయ్ వాహనాలతో తిరగడం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారిందని, ప్రజా ప్రతినిధులు ముందుగా ఆదర్శంగా నిలిచి కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించుకోవాలని సూచించారు. అవసరానికి మించి సెక్యూరిటీ వినియోగాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని సూచించారని, ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లడం కంటే మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
“నా దేశం – నా బాధ్యత” అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని ప్రధాని సూచించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రజలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖర్చుల్లో నియంత్రణ పాటించాలని అన్నారు. ఈ అంశాలపై మరో రెండు రోజుల్లో విస్తృత చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.