పశ్చిమాసియా యుద్ధం, ప్రభావ పరిస్థితులపై ప్రధాన చర్చ..
ఇంధన పొదుపు, పెట్రో ధరలు, ప్రభుత్వ నియంత్రణ చర్యలపై చర్చకు అవకాశం..
దేశం మొత్తం దృష్టి సారించిన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం నేడు జరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, వాటి ప్రభావం భారత్పై ఎలా పడే అవకాశముందనే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది.
గత మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇంధన పొదుపు, అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి సూచనలు చేస్తూ వస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్లో విస్తృత చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రజలకు మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే కేంద్ర మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం, సమావేశాలు మరియు సమీక్షా సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్ మోడ్లో నిర్వహించడం వంటి సూచనలు అందించినట్లు సమాచారం.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా సుమారు ₹30 వేల కోట్ల వరకు నష్టాలు చూస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నష్టాలను ఆయా కంపెనీలు ఎక్కువకాలం భరించలేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక తాజా పరిస్థితులపై పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తగ్గించేందుకు ముందస్తు కార్యాచరణ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్కు సంబంధించిన అంశంపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై కేంద్రం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ఇంధన వినియోగం, ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలపై ఒకేసారి దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.