మహానాడు సన్నాహక సమావేశంలో సహచర మంత్రులుతో కలిసి పాల్గొన్న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి..
మహానాడు సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సహచర నేతలతో కలిసి సమగ్రంగా సమీక్ష..
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో సన్నాహక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. మే 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సహచర మంత్రులు, పార్టీ నేతలతో కలిసి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మహానాడు విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మంత్రి సూచించారు.
ప్రత్యేకంగా భోజనాల ఏర్పాట్ల కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మహానాడుకు హాజరయ్యే అతిథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందించే ఆహార ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. భోజనాల నాణ్యత, పరిశుభ్రత, సరిపడా సౌకర్యాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
మహానాడు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు సౌకర్యవంతంగా పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నేతలు నిర్ణయించారు. భారీ స్థాయిలో నిర్వహించనున్న ఈ మహానాడును విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.