50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్..
ఎల్నినో ప్రభావానికి ముందస్తు చర్యలు… పీఎండీఎస్ అమలు..
అమరావతి: రాష్ట్రంలో రైతులకు భద్రత కల్పిస్తూ అధిక ఆదాయం వచ్చేలా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి... రైతన్న పంట ఎప్పుడూ పండుతూ ఉండాలి” అన్న లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని, ఒకే రైతు భూమిని విభజించి విభిన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు సర్టిఫికేషన్ కల్పించి మంచి ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గత రబీ సీజన్లో హెక్టారుకు యూరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని సీఎం అభిప్రాయపడ్డారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ విధానం తీసుకురావాలని, అవసరమైతే ఏజెన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ ఆధారిత అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు విస్తరించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రపంచంలోనే ప్రత్యేకంగా ‘కోకో సిటీ’ ఏర్పాటుకు సీఎం ప్రణాళిక వివరించారు. 250 ఎకరాల్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేసి, రైతులకు అనుభవ కేంద్రంగా ఉపయోగపడేలా చేయాలని సూచించారు.
ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31 కింద ప్రతి ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎం లక్ష్యంగా పెట్టారు. అరకు ప్రాంతంలో కుంకుమ పువ్వు సాగు విస్తరణపై అధ్యయనం చేయాలని, అనంతపురంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఆపిల్ పంటను విస్తరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
అవకాడో, అంజీర్, పనస, జామ, మిరియాల సాగును పెంచాలని, అంజీర్ వంటి పండ్లను డ్రైఫ్రూట్గా మార్చి విలువ పెంచాలని చెప్పారు. బీపీఎల్ కింద ఉన్న రైతులకు డెయిరీ, లైవ్ స్టాక్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో క్రాప్ సర్వే కొనసాగుతోందని, రైతుల భూమి, పంటలు, జలవనరులు, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగం వంటి వివరాలన్నీ ఫార్మర్ యాప్లో నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 8 లక్షల మంది రైతులు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. అయితే, రిజిస్ట్రేషన్ కంటే వినియోగమే ముఖ్యమని సీఎం అన్నారు.
ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఎల్నినో ప్రభావం అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
వర్షాలకు ముందే విత్తనాలు వేసే ఈ విధానం వల్ల రైతులకు ఖర్చులు తగ్గి, ఎకరాకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో దీనిని అమలు చేయాలని సీఎం సూచించారు.
2025-26లో 4,116 గ్రామాల్లో 17.74 లక్షల రైతులు 9.26 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు చేశారని అధికారులు తెలిపారు. అయితే 2026-27లో అన్ని 13,300 గ్రామాల్లో ప్రకృతి సాగు విస్తరించాలని సీఎం లక్ష్యంగా పెట్టారు. ఈ ఏడాది 25 లక్షల రైతులు, 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం జరగాలని ఆయన సూచించారు.
రైతు భరోసా కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన ఆర్ఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్బోర్డ్పై కూడా సమీక్ష జరిగింది. విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వివరాలు, బీమా సమాచారం వంటి అంశాలను రియల్ టైమ్లో ట్రాక్ చేసేలా దీనిని ఉపయోగించాలన్నారు.
రైతులు తమ ఆర్డర్లు, స్టాక్ వివరాలను కూడా ఈ డ్యాష్బోర్డ్ ద్వారా చూసుకునేలా సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతు ఆదాయం పెంచడం, సాగుకు భద్రత కల్పించడం, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రాష్ట్రాన్ని వ్యవసాయంలో ముందంజలో నిలపాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.